by Suryaa Desk | Tue, Oct 01, 2024, 02:02 PM
కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. మూసీ- హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డారని ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపైనా దాడికి తెగబడ్డారు.గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు. ఆపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ గూండాలు ఏ మాత్రం తగ్గలేదు. కొందరైతే ఏకంగా కారుపైకి ఎక్కి మరీ దురుసుగా ప్రవర్తించారు. చివరకు బీఆర్ఎస్ శ్రేణులు వారిని తన్ని తరిమివేశారు. అనంతరం అంబర్పేట గోల్నాక పరిధిలోని తులసీరామ్ నగర్ వెళ్లిన కేటీఆర్ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగపట్టారన్నారు. గరీబోళ్లంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నరని, వాళ్ల బతుకులను ఆగం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. మూసీమే లూఠో.. దిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ నినాదమని విమర్శించారు. మీ ఇండ్ల మీదకు బుల్డోజర్ వస్తే కంటె అడ్డుపెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి కాదు.. ఆయన తాత వచ్చినా ఏమీ చేయలేరన్నారు.కాగా, కేటీఆర్ కారుపై కాంగ్రెస్ గూండాల దాడి ఘటనపై బీఆర్ఎస్ పార్టీ తవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులపై అధికార పార్టీ నాయకులు దాడి చేయడమేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించింది. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని నిలదీసింది. రేవంత్.. నీ అప్రజాస్వామిక చర్యలకు ప్రజలు నిన్ను మూసీలో కలపడం ఖాయమని హెచ్చరించింది.