by Suryaa Desk | Tue, Oct 01, 2024, 01:35 PM
వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నేతృత్వంలో సోమవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 624 కిలోల ఎండు గంజాయిని అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్ పర్యవేక్షణలో పోలీస్ ఫైరింగ్ రెంజ్ మంచుకొండ అటవీ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు.
ఖమ్మం వన్ టౌన్ , ఖమ్మం టూ టౌన్ , ఖమ్మం త్రీ టౌన్ , నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వేంసూరు, కల్లూరు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 7 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను అరెస్టు చేసినట్లు అడిషనల్ డిసీపీ తెలిపారు. జిల్లాలో ఠాణాల్లో నిల్వ ఉన్న గంజాయి సరకును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్వీర్యం చేశామన్నారు. కార్యక్రమంలో సిఐలు ఉదయ్ కుమార్, రమేష్, జానర్ధన్, ఉస్మాన్ షారిఫ్ , కల్లూరు ఎస్సై ఇతర అధికారులు పాల్గొన్నారు.