by Suryaa Desk | Mon, Sep 30, 2024, 08:59 PM
తెలంగాణలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఆశించిన దానికంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. ఈ నెల మెుదట్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతాలకుతలం చేశాయి. ఆ తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన వరుణుడు.. గత వారం రోజులుగా మళ్లీ పలకరిస్తున్నాడు. తాజాగా రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
నైరుతి రుతుపవనాలు ఉత్తర భారత్ నుంచి తిరోగమించటం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాలుగా పిలిచే ఈ పవనాలు ప్రస్తుతం మధ్యప్రదేశ్ దాటినట్లు వెల్లడించారు అక్టోబర్ తొలివారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఈ పవనాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం బంగాళాతంలో అల్పపీడనం తరహా వాతావరణం ఉందని.. దాని ప్రభావంతో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు రాష్ట్రంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని.. భారీ వర్షాలకు మాత్రం ఛాన్స్ లేదన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, మేడ్చల్-మలాజ్గిరి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అకత్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇక ఆదివారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గండిపేట, బండ్లగూడ, అత్తాపూర్, నాంపల్లి, అబిడ్స్, బేగంబజార్, నార్సింగి, మణికొండ, బాచుపల్లి, మియాపూర్, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్ పేట, ట్యాంక్ బండ్, కుత్బుల్లాపూర్, బోరబండ, మోతినగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కోఠి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు కూడా నగరంలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.