by Suryaa Desk | Wed, Oct 02, 2024, 08:12 AM
ఉద్యోగం ఇప్పిస్తానని రూ.16 లక్షలు తీసుకుని మోసం చేశారన్న ఆవేదనతో.. భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంనగర్లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడు మండలం సాయిరాంతండాకు చెందిన హాలావత్ రత్నకుమార్(34), పార్వతి(30) భార్యాభర్తలు. చుంచుపల్లి మండలం గాంధీ కాలనీలో నివాసముంటున్నారు. డిగ్రీ చదివిన రత్నకుమార్ రెండేళ్ల నుంచి కొత్తగూడెం విద్యానగర్లోని ఓ షాపింగ్మాల్లో పనిచేస్తున్నారు.అదే షాపింగ్మాల్లో పనిచేసే ఓ వ్యక్తి.. డబ్బులు ఇస్తే సింగరేణి సంస్థలో ఉద్యోగం వస్తుందని, దానికి ఓ దళారీ ఉన్నాడని చెప్పాడు. దీంతో రత్నకుమార్ బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి దళారీకి రూ.16 లక్షల వరకు చెల్లించారు. ఆ తర్వాత ఉద్యోగంపై దళారీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అతన్ని రత్నకుమార్ ఇటీవల నిలదీశారు.
అతను దురుసుగా మాట్లాడటంతో మోసపోయామని భార్యాభర్తలు గ్రహించారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురైన వారిద్దరూ తమ ఇంట్లో సోమవారం రాత్రి కలుపు మందు తాగారు. విషయం తెలియడంతో వారిని రత్నకుమార్ తల్లిదండ్రులు తొలుత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.