by Suryaa Desk | Wed, Oct 02, 2024, 02:33 PM
భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసి నిర్వాసితులను కలిసేందుకు వెళ్తున్న కాన్వాయ్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడటంపై బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తే కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారన్నారు. పేద ప్రజలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం అంతు చూస్తామని హెచ్చరించారు. మూసి నిర్వాసితుల పక్షాన భారాస నిరంతరం పోరాటం చేస్తుందని వెల్లడించారు. పేదలకు సాయం చేసేందుకు ప్రభుత్వాలు ఉంటాయని, కానీ రేవంత్ రెడ్డి పేదల పొట్టగొడుతున్నారన్నారు. కూడే కాదు గూడు కూడా లేకుండా చేసే కుట్రలు రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలను ఢిల్లీకి కప్పం కట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని స్పష్టం చేశారు.
తెలంగాణ సొమ్మును ఢిల్లీకి ధారాదత్తం చేసేందుకు పేదలను రోడ్డు పాలు చేసేలా నియంత పోకడను అవలంభిస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చే కుట్రలను మానుకోకపోతే అంతు చూస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు ఓటు వేయలేదన్న అక్కసుతో వారిపై బుల్డోజర్లను దించుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు అంటే రేవంత్ రెడ్డికి కోపం ఎందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను కేటీఆర్ కాన్వాయ్ పై ఉసి గొల్పి దాడులు చేయిస్తున్నారని, అది మంచి పద్దతి కాదన్నారు. కేటీఆర్ ఎప్పుడూ పేదల పక్షమేనని స్పష్టం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశారన్నారు. భారాస పేద ప్రజలకు అండగా నిలుస్తుందని రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.