by Suryaa Desk | Wed, Oct 02, 2024, 02:39 PM
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా సేవలను అందిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ -2 లో కుత్బుల్లాపూర్ కు మెట్రో సేవలను విస్తరించాలని ఎమ్మేల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ బేగంపేట్ లోని హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ఎంతోమంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చుతూ దేశంలోనే మూడవ అతిపెద్ద మెట్రో రైల్ సంస్థగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైల్ ను విస్తరించాలని భావిస్తున్న ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూ, మెట్రో రైల్ ఫేజ్ -2 విస్తరణలో కుత్బుల్లాపూర్ ప్రాంతాన్ని ప్రాధాన్యతను ఇవ్వాలని..భాగ్యనగరానికి ఉత్తర దిక్కున అతివేగంగా అభివృద్ధి చెందుతున్న కుత్బుల్లాపూర్ ప్రాంతం నుంచి లక్షలాదిమంది ఉద్యోగులు నగరంలోని వివిధ ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారన్నారు.
అంతేకాక కుత్బుల్లాపూర్- సుచిత్ర - కొంపల్లి ప్రాంతాలతో పాటు ఐడీపీఎల్ - చింతల్ - షాపూర్ నగర్ - జీడిమెట్ల - సూరారం - దుండిగల్ ప్రాంతాల నుంచి నిత్యం లక్షలాదిమంది ప్రయాణిస్తుంటారని..హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా....రూట్ -1: గండి మైసమ్మ నుంచి సూరారం - జీడిమెట్ల - షాపూర్ నగర్ - చింతల్ - బాలానగర్ చౌరస్తా మీదుగా భరత్ నగర్ మెట్రో స్టేషన్ వరకు అదేవిధంగా రూట్ -2 : మేడ్చల్ నుంచి కొంపల్లి - సుచిత్ర - బోయిన్ పల్లి - మీదుగా సికింద్రాబాద్ కు మెట్రో రైల్ ను ఏర్పాటు చేస్తూ నూతన మెట్రో లైన్ లను ఏర్పాటుచేయాలన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా కుత్బుల్లాపూర్ కు మెట్రో రైల్ విస్తరణ ను చేపట్టి ప్రజలు సుదూర ప్రాంతాలకు వేగంగా చేరుకునేలా చూడాలని వినతి పత్రంలో కోరారు.
మెట్రో ఎండీ ని కలిసిన వారిలో ఎమ్మెల్యే తో పాటుగా దుందిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, జిహెచ్ఎంసి డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.