by Suryaa Desk | Thu, Oct 03, 2024, 03:30 PM
నాగచైతన్య, సమంత విడిపోవడానికి, చాలామంది హీరోయిన్లు సినీ పరిశ్రమను వదిలి పోవడానికి కేటీఆరే కారణమన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. రాజకీయాల్లోకి సినిమా పరిశ్రమకు చెందిన వారిని లాగడం ఏమిటని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య, సమంత, హీరోయిన్లపై సురేఖ మాట్లాడిన తీరును చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున తదితర ప్రముఖులు స్పందించారు.తాజాగా, నటుడు మహేశ్ బాబు కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మా సినిమా కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనకు ఎంతో బాధ కలిగించాయని పేర్కొన్నారు. ఒక కూతురికి తండ్రిగా, భార్యకు భర్తగా, ఓ తల్లికి కొడుకుగా... ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన వ్యాఖ్యలు, ఉపయోగించిన భాష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఆమె భాషపట్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని తెలిపారు.ఎదుటివారి మనోభావాలను గాయపర్చనంత వరకు మనకు వాక్స్వాతంత్రం ఉంటుందని గుర్తు చేశారు. ఇలాంటి చవకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సినిమా వారిని లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మన దేశంలోని మహిళలను, సినిమా పరిశ్రమ వారిని గౌరవించాలని సూచించారు.