by Suryaa Desk | Fri, Oct 04, 2024, 07:22 PM
తెలంగాణలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్తగా మరో రెండు ఐఐఐటీ (IIIT)లు ఏర్పాటు కానున్నాయి. బాసరలోని రాజీవ్ గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (RGUKT)కి అనుబంధంగా ఈ కొత్త క్యాంపస్లను ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర తెలంగాణలో ఒక ప్రాంగణం (ఆర్జీయూకేటీ) ఉన్నందున కొత్త క్యాంపస్లను దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో రెసిడెన్షియల్ క్యాంపస్కు 100 ఎకరాల భూమి, రూ. 500 కోట్ల వ్యయం అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటిలో ఒక ప్రాంగణాన్ని వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.
గ్రామీణ ప్రాంతాలకూ సాంకేతిక విద్యను పరిచయం చేయాలని.. వెనుకబడిన జిల్లాల నుంచి కూడా ఐటీ నిపుణులను తయారు చేయాలనే ఆశయంతో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 ట్రిపుల్ ఐటీలను ప్రారంభించింది. వాటిలో తెలంగాణ ప్రాంతంలోని బాసర ఆర్జీయూకేటీ క్యాంపస్ ఒకటి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఇదొక్కటే ట్రిపుల్ ఐటీ మిగిలింది.
ఐఐటీ రామయ్య కల
గ్రామీణ విద్యార్థుల నుంచి పోటీ ఎక్కువ కావడంతో రాష్ట్రంలో మరో ట్రిపుల్ ఐటీ ప్రాంగణాన్ని నెలకొల్పాలని విద్యావేత్త చుక్కా రామయ్య (ఐఐటీ రామయ్య) ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో దాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి సర్కార్ తాజా నిర్ణయంతో రామయ్య చిరకాల వాంఛ నెరవేరే అవకాశం ఉంది.
కొత్త క్యాంపస్లు ఈ జిల్లాల్లోనే..
కొత్తగా ఏర్పాటు చేయబోయే రెండు క్యాంపస్లలో ఒక దాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరొకదాన్ని ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తు్న్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం బాసర ఆర్జీయూకేటీలో ఏటా 1500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులు కావడంతో క్యాంపస్లో 9 వేల మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. దీంతో క్యాంపస్పై భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి దీనికి అదనంగా ఒక్క క్యాంపస్ అయినా అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
కొత్త కోర్సులు కూడా..
ప్రస్తుతం బాసర ఆర్జీయూకేటీలో సంప్రదాయ ఇంజినీరింగ్ కోర్సులు మాత్రమే ఉన్నాయి. వీటికి అదనంగా బీటెక్ బయో టెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, బయో మెడికల్, ఫార్మా టెక్నాలజీ లాంటి ‘ఇంజినీరింగ్ + బయో సైన్స్ మల్టీ డిసిప్లినరీ’ కోర్సులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు.
రాష్ట్రంలో కొత్త ఐఐఐటీలను నెలకొల్పుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘విద్యారంగంలో సంస్కరణలు’ అంశంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘానికి మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ ఉప సంఘం ఇటీవల సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ 4 ప్రతిపాదనలను సమర్పించింది. కొత్తగా 2 ఆర్జీయూకేటీ క్యాంపస్లను ప్రారంభించడం, వాటిలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం వీటిలో రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు.