by Suryaa Desk | Sat, Oct 05, 2024, 06:37 PM
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అటు తెలంగాణ రాజకీయాలతో పాటు ఇటు తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలను టాలీవుడ్కు చెందిన ప్రముఖులు ముక్త కంఠంతో ఖండించగా.. తాజాగా సీనియర్ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ మురళి కూడా స్పందించారు. కేవలం స్పందించటమే కాకుండా.. కొండా సురేఖకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తాను చెప్పినట్టు చేయాలని బతిమాలటం గమనార్హం. ఇందుకు సంబంధించి ఓ వీడియోను పోసాని విడుదల చేశారు.
తనకు.. మంత్రి కొండా సురేఖ అకారణంగానే 30 ఏళ్లుగా తెలుసని పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చారు. ఆమె భర్త కొండా మురళి కూడా మంచోడని తెలిపారు. అయితే ఆమె ఎందుకు నోరుజారిందో సురేఖనే ఆలోచించుకోవాలన్నారు. అనకూడని వ్యాఖ్యలు చేసిందన్నారు. అక్కినేని నాగార్జున మంచి వ్యక్తి అని.. తనకు ఆయన 40 ఏళ్లుగా తెలుసని చెప్పుకొచ్చారు. అలాంటి మంచి వ్యక్తిపై, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పని పోసాని అభిప్రాయపడ్డారు. అలాగే.. రకుల్ ప్రీత్ సింగ్ కూడా.. పెళ్లి చేసుకుని ముంబైలో ఉంటుందని పోసాని గుర్తు చేశారు.
కొండా సురేఖ అన్న ప్రతి మాట.. అక్కినేని కుటుంబాన్ని, రకుల్ ప్రీత్ సింగ్ను భాదపెట్టినట్టు పోసాని చెప్పుకొచ్చారు. ఈక్రమంలో.. కొండా సురేఖ ఏం చేయాలనే విషయాన్ని కూడా పోసాని సూచించారు. "ప్రెస్మీట్ పెట్టి.. ఆ ఆడవాళ్లు నా సోదరితో సామానులు అనండి. నాగార్జునను కూడా సోదరుడు అని చెప్పి, ఆవేశంలో అన్నాను అని బహిరంగ క్షమాపణలు చెప్పండి. సింపుల్గా మ్యాటర్ క్లోజ్ అవుతుంది. మీరు మంచి వారు కాబట్టి నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను కొండా సురేఖ." అంటూ స్పెషల్గా రిక్వెస్ట్ చేశారు పోసాని కృష్ణ మురళి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమని.. ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండేందుకు నాగార్జున, నాగచైతన్య చేసిన పనికే సమంత విడాకులు తీసుకుందని.. కొండా సురేఖ ఘాటు ఆరోపణలు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబమంతా ఘాటుగా స్పందించారు.
అయితే.. ఆ ఆరోపణలను మూకుమ్మడిగా ఖండిస్తుండటంతో.. కొండా సురేఖ ఓ ట్వీట్ వదిలారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని పోస్ట్ పెట్టారు. కానీ.. నాగార్జున మాత్రం తగ్గేదేలే అంటూ.. కొండా సురేఖపై పరువు నష్టం దావా కూడా దాఖలు చేశారు. తమ కుటుంబ పరువును దిగజార్చేలా ఆరోపణలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్లో నాగార్జున పేర్కొనటం గమనార్హం. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.