by Suryaa Desk | Thu, Oct 03, 2024, 10:53 AM
హీరోయిన్ సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు.రాజ్యాంగబద్ధమైన బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, మహిళలను వివాదాల్లోకి లాగడం సరికాదని ఆక్షేపిస్తున్నారు. వెంటనే అక్కినేని కుటుంబంతో పాటు హీరోయిన్ సమంతపై చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేఖ వెంటనే వెనక్కి తీసుకోవాలని ఫైర్ అవుతున్నారు.
అయితే, ఈ వివాదం మరింతగా ముదురుతుండటంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలుగజేసుకున్నారు. చేసిన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని కొండా సురేఖ కు ఆయన సూచించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. తనకు జరిగిన అవమానంతో ఆవేదనకు గురై విమర్శలు చేశానని స్పష్టం చేశారు. తాజాగా సమంతపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఆవేదన చెందానని, అందుకే కామెంట్స్ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. కానీ, కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గే ప్రస్తక్తే లేదని, రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆమె ఫైర్ అయ్యారు. ఆయన పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని అన్నారు. తాను కేటీఆర్ ను మాత్రమే విమర్శించానని, తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని తెలిపారు. అదేవిధంగా నటి సమంతపై చేసి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా కొండ సురేఖ మరోసారి మీడియా ముఖంగా వెల్లడించారు.