by Suryaa Desk | Fri, Oct 04, 2024, 11:16 AM
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో కొలువైన శ్రీలక్ష్మీ తాయారమ్మ వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి.ఈ ఉదయం అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారం లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు చేస్తారు. అమ్మవారికి ఈనెల 12వ తేదీ వరకు రోజుకో అలంకరణ చేయనున్నారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 12న విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామ్లీలా మహోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న శబరి స్మృతియాత్ర సైతం నిర్వహించనున్నారు.
శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు రోజుకో అలంకారంలో శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈరోజు ఆదిలక్ష్మి, 5న సంతానలక్ష్మి, 6న గజలక్ష్మి, 7న ధనలక్ష్మి, 8న ధాన్యలక్ష్మి, 9న విజయలక్ష్మి, 10న ఐశ్వర్యలక్ష్మి, 11న వీరలక్ష్మి, 12న మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు తిరువీధి సేవలు, సంక్షేప రామాయణహవనం నిర్వహిస్తారు.
కాగా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిత్రకూట మండపంలో శ్రీరామాయణ మహా పారాయణం గురువారం ప్రారంభమైంది. స్వామి వార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి మండపంలో కొలువుదీర్చారు. పారాయణం చేసే స్థానాచార్యులు స్థలశాయి, వేద పండితులకు ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేష వస్త్రాలను అందజేశారు. తొలిరోజు బాలకాండ పారాయణంతో క్రతువు వైభవంగా ప్రారంభమైంది. రెండో రోజైన శుక్రవారం అయోధ్యకాండ పారాయణం చేయనున్నారు.రామాలయంలో గురువారం స్వామి వారి నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యాహవాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.