by Suryaa Desk | Sat, Oct 05, 2024, 07:10 PM
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో ఓ యువకుడి సెల్పీ సూసైడ్ అటెంప్ట్ కలకలం రేపింది. చేయని తప్పుకు పోలీసులు కొట్టారని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చెట్టుకు ఉరేసుకొని ప్రాణాలు తీసుకునేందుకు ట్రై చేశాడు. గమనించిన గ్రామస్తులు అతడిని కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన నాగరాజు (30 ) స్థానికంగా ఉండే బాలాజీ క్రషర్ మిల్లులో టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. నాగరాజుతో పాటుగా మరో నలుగురు కూడా డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అయితే వీరంతా కలిసి డీజిల్ చోరీ చేశారని మిల్లు ఓనర్ గొలుసుల వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని స్టేషన్కు పిలిపించి విచారించారు.
విచారణ తర్వాత ఇంటికి చేరుకున్న నాగరాజు.. సూసైడ్కు యత్నించాడు. చేయని నేరానికి పోలీసులు కొట్టారని సెల్పీ వీడియో రికార్డు చేశాడు. 'నేను ఎన్నడూ పోలీస్ స్టేషన్కు పోలేదు.. ఎవరి మీదకు లొల్లికి పోలేదు. ఎమ్మెల్యే మందుల సామేల్ ఫోన్ చేసి చెప్పిండని ఎస్ఐ నన్ను బాగా కొట్టిండు. గొలుసు వెంకన్న నా ఇల్లు ముంచుండి. నన్ను పిరికివాడని అనుకున్నా సరే అవమానంతో బతకలేను. నేను చనిపోతున్నా' అని వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే మందు సామేల్ వెల్లడించారు.
కాగా.. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే చెప్పాడని అమాయకుడిని కొడతారా..? అని ప్రశ్నించింది. 'ఏనాడు పోలీస్ స్టేషన్కు పోని తనను... ఎవరితోనూ లొల్లికి కూడా పోని తనను ఎమ్మెల్యే మందుల సామెల్ చెప్పిండని దొంగతనం నెపం మోపి, ఎస్సై తీవ్రంగా కొట్టడంతో అవమానంతో డ్రైవర్ నాగరాజు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ వీడియో వింటే ఎంతో బాధగా ఉంది. దీన్ని మరణ వాంగ్మూలంగా తీసుకొని, ఎస్సైని ఉద్యోగం నుండి తొలగించాలి.
ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు పెట్టాలి. ఎమ్మెల్యే చెప్పిండని ఎస్సై కొడతారా..? ఇదేక్కడి దారుణం. ఇందిరమ్మ రాజ్యంలో నిత్యం ఇలాంటి మరణవార్తలు వినాల్సిందేనా..? ఆనాటి రోజులు తెస్తానని చెప్పింది ఇవేనా? అధికారం ఉందని విర్రవీగుతున్న కాంగ్రెస్ నాయకుల్లారా.. మీ అరాచకాలకు ప్రజలే సమాధి కడుతరు. మీ దుర్మార్గాన్ని ఎదురిస్తారు. మిమ్ముల్ని, మీ అధికారాన్ని బొందపెట్టి గుణపాఠం చెబుతారు.' అని ట్వీట్ చేశారు.