by Suryaa Desk | Fri, Oct 04, 2024, 06:29 PM
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం మొండ్రాయి గూడెంలో, నిన్న ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంలో, పిడుగుపాటుకు గురై గాయాలపాలైన బానోతు బాలును, కొత్తగూడ ప్రైమరీ సెంటర్ నుండి నర్సంపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి 18 నిమిషాలలో చేరవేసి, బానోతు బాలు ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ గుగులోతూ సురేష్ ను గూడూరు సీఐ కె. బాబురావు సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. కొత్తగూడ మండలం చాలా పెద్ద మండలం. సక్రమంగా సౌకర్యాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని, మీకేమైనా సమాచారం ఉంటే ఆటో డ్రైవర్లు వారిని వెంటనే కాపాడాలని అన్నారు.
ఈ మధ్యకాలంలో రోడ్ల పైన ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీరు వెళ్లే సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగి ఉంటే వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాలి. మీరు కాపాడే ప్రాణాలు, వారి కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారన్నారు. కొత్తగూడ నుండి నర్సంపేట వరకు గతుకుల రోడ్డు ఉన్నప్పటికీ, తన ఆటోను చాకచక్యంగా నడుపుకుంటూ, ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన డ్రైవర్ గుగులోతు సురేష్ ను, సీఐ కె. బాబురావు, ఎస్ఐ కుశ కుమార్ లు సన్మానించారు. ముసలమ్మ ఆటో యూనియన్ సభ్యులను అభినందించారు.