by Suryaa Desk | Sat, Oct 05, 2024, 09:54 PM
అధికారం పోయిందన్న అక్కసుతో పొద్దున లేస్తే చాలు.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై భారాస నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్మెట్ మండలం బాటసింగారంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా భాస్కరాచారి, పాలకవర్గం సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండ్ల మార్కెట్ గడ్డిఅన్నారం అని.. అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పాలకవర్గానికి సూచించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ''పదేళ్ల పాలనలో నాటి భారాస సర్కారు ఏకకాలంలో లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపించింది. భారాస హయాంలో సన్న ధాన్యం క్వింటాట్పై రూ. 500 బోనస్ ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదు? మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే వద్దన్నారు. ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తే మహిళలంతా సంతోషంగా సొంతూళ్లకు వెళ్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన మూసీ ప్రక్షాళనకు అంతా సహకరించాలి. త్వరలోనే సీఎం ఆదేశాల మేరకు రైతాంగం, ట్రేడర్ల సౌకర్యార్థం శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది'' అని సీతక్క తెలిపారు.