by Suryaa Desk | Sat, Oct 05, 2024, 09:58 PM
తెలంగాణలో ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఇవాళ ఫిలిప్పీన్స్ వ్యవసాయ, ఆహార శాఖ మంత్రి రోజేర్స్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. గత కొంతకాలంగా భారత్ నుంచి ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతులు జరగడంలేదన్న విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. నాణ్యతా పరమైన అంశాల కారణంగానే భారత్ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవడంలేదని ఫిలిప్పీన్స్ మంత్రి ప్రస్తావించినట్టు తెలుస్తోంది.దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ... తెలంగాణలో ధాన్యం దిగుబడులు పెరగడమే కాకుండా, బియ్యం నాణ్యత కూడా మెరుగైందని వివరించారు. త్వరలోనే ఫిలిప్పీన్స్ కు తెలంగాణ నుంచి దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు చేసే అవకాశం ఉందని చెప్పారు.