by Suryaa Desk | Tue, Oct 08, 2024, 10:28 AM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ సూచీలు అప్రమత్తత పాటిస్తున్నాయి. దీంతో మంగళవారం సూచీలు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 81,133 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 24,808 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 83.93గా కొనసాగుతోంది.సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, హెచ్యూఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్గ్రిడ్, టైటాన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. చైనా సూచీ షాంఘై లాభాల్లో ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) క్రమంగా తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో వెనక్కి తీసుకుంటుంటే అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఎఫ్ఐఐలు వరుసగా ఆరో రోజు సోమవారం నికరంగా రూ. 8,293 కోట్ల షేర్లను విక్రయించగా.. డీఐఐలు నికరంగా రూ.13,245 షేర్లను కొనుగోలు చేశారు. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.76 డాలర్ల పైన ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,661.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.