by Suryaa Desk | Sun, Oct 06, 2024, 10:04 PM
రైతులు రబీ సీజన్లో పండించిన ధాన్యంను ఒక గింజను వదలకుండా కొనుగోలు చేయాలని, జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలని, ధాన్యం తరలింపులో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శనివారం ∙సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలు పై జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. సన్నాలను, దొడ్డు ధాన్యమును విడిగా కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో రెతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యంను తూకం వేసిన తర్వాత రైస్మిల్లర్లకు తరలించేందుకు వాహనాలనుకూడా అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు చేరే వరకు అధికారులదే భాద్యతయని అన్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద నిఘా ఉంచాలని, ఇతర రాష్ట్రాల నుండి సన్నరకం ధాన్యం జిల్లాలోకి రవాణా కాకుండా చెక్ పోస్టు లను ఏర్పాటు చేయాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రైతులకు 48 గంటల్లో వారి ఖాతాలో జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో రెవిన్యూ, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, పోలీసులు, సహకార శాఖ, ఐకెపి, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.