by Suryaa Desk | Mon, Oct 07, 2024, 06:14 PM
తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు డ్రైవర్ 45 మంది ప్రయాణికులను కాపాడి తాను మృత్యు ఒడికి చేరుకున్నాడు. బస్సు రన్నింగ్లో ఉండగానే గుండెపోటుకు గురికాగా.. ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ బయల్దేరింది. ఠాకూర్ రమేష్ సింగ్ బస్సు డ్రైవింగ్ చేస్తుండగా.. గజ్వేల్ దగ్గరకు రాగానే ఛాతీలో నొప్పిగా ఉందని ప్రయాణికులకు చెప్పాడు. అనంతరం సురక్షితంగా బస్సును రోడ్డు పక్కకు నిలిపేశాడు. ఆ సమయంలో బస్సులో మెుత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యలోనే డ్రైవర్ రమేష్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడి తాను ప్రాణాలు విడిచాడని కంటతడి పెట్టుకున్నారు.
మరో ఘటనలో ఆర్టీసీ బస్సెక్కిన ఓ ప్రయాణికుడు కండక్టర్, డ్రైవర్పై దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో డ్రైవర్ తలకు తీవ్ర గాయం అయింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ( అక్టోబర్ 6) ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ బయల్దేరింది. బొంగ్లూర్ క్రాస్ రోడ్డు వద్ద ఒక వ్యక్తి మద్యం మత్తులో బస్సు ఎక్కాడు. ఎక్కగానే సీటులో కూర్చున్న అతడు టికెట్ తీసుకోవాలని కండక్టర్ గట్టిగా అరిచినా.. ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే నిద్రపోయాడు.
బస్సు కొద్దిదూరం వెళ్లగానే డ్రైవర్ రోడ్డు పక్కన ఆపేశాడు. అనంతరం మద్యం మత్తులో ఉన్న అతడిని కండక్టర్ సాయంతో కిందకు దింపాడు. బస్సు దిగగానే సదరు మందుబాబు డ్రైవర్, కండక్టర్పై రాళ్ల దాడికి దిగాడు. నన్నే బస్సు నుంచి కిందకు దించుతారా..? అంటూ వాళ్లపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో రాయి తగిలి డ్రైవర్ తలకు తీవ్ర గాయమైంది. పక్కనే ఉన్న ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న డ్రైవర్ ఆ తర్వాత ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నారు. అతడు నందనవనం గాయత్రీనగర్కు చెందిన శంకర్గా గుర్తించారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడినందుకు గాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.