by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:14 PM
హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, బెంగళూరుకు వందే భారత్ ట్రైన్లు నడుస్తుండగా.. సికింద్రాబాద్-నాగ్పుర్ మధ్య కూడా ఐదో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ ప్రారంభించగా.. సెప్టెంబర్ 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ట్రైన్లో ఆక్యుపెన్సీ ఆశించినంతగా ఉండటం లేదు. వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో దాదాపుగా అన్ని కోచ్లు ఖాళీగానే ఉంటున్నాయని రైల్వే అధికారులు గుర్తించారు.
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ కొత్త వందే భారత్ ట్రైన్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణలోని రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్ పారిశ్రామిక కేంద్రాలతో కనెక్ట్ చేయటానికి వందే భారత్ ట్రైన్ను నడుపుతున్నారు. కాగా, ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి 80 శాతం ఖాళీతో నడుస్తోంది. ట్రైన్ మొత్తం సామర్థ్యం 1,440 కాగా.. దాదాపు 1200 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
వందే భారత్ ట్రైన్ బోగీల సంఖ్యను తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 బోగీలతో నడుస్తుండగా.. 10 బోగీలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బోగీల సంఖ్యను తగ్గించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి- విశాఖపట్నానికి రెండు ట్రైన్లు, తిరుపతి, బెంగళూరు (యశ్వంత్పుర) నగరాలకు ఒక్కోటి చొప్పున నాలుగు వందేభారత్ ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ ట్రైన్లన్నీ కూడా 110-120 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.
దీంతో నాగ్పుర్ ట్రైన్ 10 కోచ్లు తగ్గించి వీటికి కలపనున్నారు. అయితే ఏ వందేభారత్కు కలపాలన్న విషయంపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఫోకస్ పెట్టారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఇప్పటికే రెండు వందేభారత్లు ఉన్నాయి. ఒక దానిలో 16, మరో దానిలో 8 కోచ్లు ఉన్నాయి. సికింద్రాబాద్-బెంగళూరు ట్రైన్లో మాత్రం 8 కోచ్లు మాత్రమే ఉన్నాయి. తగ్గించే కోచ్లను కలిపే విషయంలో బెంగళూరు, విశాఖపట్నం ట్రైన్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.