by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:09 PM
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలకమైన ప్రాజెక్టులపై కేంద్రమంత్రితో చర్చించారు. హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ (CSMP), మూసీ సహా సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం, మెట్రో రైలు విస్తరణకు సంబంధించి ప్రాజెక్టులపై రాష్ట్రానికి సహకరించాలని కోరారు.
సీసీఎంపీని అమృత్ 2.0 లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. చారిత్రక హైదరాబాద్ నగరంలో ఏళ్లనాటి మురుగు శుద్ధి వ్యవస్థే ఉందని, ప్రస్తుత అవసరాలకు ఆ వ్యవస్థ ఏమాత్రం తగినట్లుగా లేదని వివరించారు. శివారు పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదని తెలిపారు.
సివరేజీ మాస్టర్ ప్లాన్లో భాగంగా హైదరాబాద్తో పాటు శివారు 27 పురపాలక సంఘాలను కలుపుకొని 7,444 కి.మీ. మేర రూ.17,212.69 కోట్లతో రూపొందించిన డీపీఆర్ను కేంద్ర మంత్రికి అందజేశారు. మూసీలో మురుగునీరు చేరకుండా ఉండేందుకు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 4 వేల కోట్లతో రూపొందించిన మరో డీపీఆర్ను సైతం కేంద్ర మంత్రికి సమర్పించారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశలో నాగోల్ - శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి.మీ.), రాయదుర్గం - కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్ - పటాన్చెరు (13.4 కి.మీ.), ఎల్బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ. మేర విస్తరణకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ కారిడార్ల నిర్మాణ అంచనా వ్యయం రూ. 24,269 కోట్లలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో జాయింట్ వెంచర్గా చేపట్టాలని కోరారు. దీనిపై త్వరలోనే డీపీఆర్ను సమర్పిస్తామని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి వెంట ఎంపీలు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.