by Suryaa Desk | Thu, Oct 10, 2024, 06:44 PM
ఎస్ఐ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ.. ఓ మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకునేందు ప్రయత్నించింది. ఈ ఘటన మెదక్ జిల్లా చిలిప్చేడ్ పోలీస్ స్టేషన్లో చేటు చేసుకోగా.. ఆత్మహత్యాయత్నం ఘటన డిపార్ట్మెంట్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిలిప్చేడ్ పోలీస్ స్టేషన్లో సుధారాణి సుధారాణి ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే స్టేషన్ ఎస్ఐ యాదగిరి గత కొంత కాలంగా తనను వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపణలు చేశారు.
తాను సక్రమంగా విధులు నిర్వహిస్తున్నా విధులకు హాజరుకావడంలేదని కానిస్టేబుల్స్తో అటెండెన్స్ వేయిస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేసింది. ఎస్ఐ యాదగిరి కావాలనే.. కక్షపూరితంగా తనను దుర్భాషలడుతూ మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సుధారాణి సూసైడ్ లెటర్ కూడా రాసింది. గమనించిన తోటి పోలీస్ సిబ్బంది.. ఆమెను వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
కాగా, ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం ఘటన స్థానికంగా కలకలం రేపింది. అందరికీ రక్షణ కల్పించే మహిళా ఏఎస్ఐకి రక్షణ లేకపోతే సాధారణ మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారని పోలీసులను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రక్షకులే భక్షకులుగా మారుతున్నాదని తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. కాగా, మహిళా ఏఎస్సైకు సంబంధించిన వీడియో, సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అయితే గతంలోనూ ఏఎస్సై సుధరాణి ఆత్మహత్య చేసుకుంటున్నానని ముగ్గురు ఎస్ఐలను బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆమెపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలిసింది. విచారణ తర్వాత అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి. కాగా, గత కొంత కాలంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. కాళేశ్వరం ఎస్ఐ మహిళా కానిస్టేబుల్పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తుపాకీ గురి పెట్టి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐను సస్పెండ్ చేశారు.