by Suryaa Desk | Wed, Oct 09, 2024, 12:31 PM
తెలంగాణ విద్యుత్ శాఖలో త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు ఉద్యోగ ప్రకటన ఇవ్వనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఓ ప్రకటనలో వెల్లడించారు.విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేస్తామని అన్నారు. తాజాగా ఆయన ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ..త్వరలోనే విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పదేళ్లుగా నిలిచిన పదోన్నతులను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1912 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. ఇటీవల వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకొనేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వరదల సమయంలో శ్రమించిన విద్యుత్ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇక విద్యార్ధుల ఫీజు రీయంబర్స్మెంటు, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేస్తామని, దసరా కంటే ముందుగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.