|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 04:49 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "కారణజన్ముడి కడుపున కవిత లాంటి రాక్షసి పుట్టడం దురదృష్టకరం" అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై తన వ్యాపారాలను కాపాడుకునేందుకే కవిత.. తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్తో పాటు పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతితో కలిసి చింతా ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ఆమెకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఇప్పుడు 'జనం బాట' పేరుతో యాత్ర చేస్తూ ప్రజా సమస్యలను వదిలేసి, హరీశ్రావును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి ఏడు సీట్లు గెలిపించిన హరీశ్రావుపై చేసిన వ్యాఖ్యలకు కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.