|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 04:23 PM
దేశంలో బంగారం దిగుమతులు అక్టోబరు నెలలో సరికొత్త రికార్డు సృష్టించాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా మూడింతలు పెరిగి 1,472 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,30,404 కోట్లు) చేరాయి. 2024 అక్టోబరులో ఇవి కేవలం 492 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం గిరాకీ అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణమని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5 శాతాన్ని దాటింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్-అక్టోబరు మధ్య ఏడు నెలల్లో పసిడి దిగుమతుల విలువ 21.44 శాతం పెరిగి 4,123 కోట్ల డాలర్లకు (రూ.3.65 లక్షల కోట్లు) చేరింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.1.30 లక్షలకు చేరువలో ఉన్నప్పటికీ, కొనుగోళ్లు తగ్గకపోవడం గమనార్హం. ఇదే సమయంలో వెండి దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. అక్టోబరులో వెండి దిగుమతులు 528.71 శాతం వృద్ధితో 271 కోట్ల డాలర్లుగా (రూ.24,007 కోట్లు) నమోదయ్యాయి.