|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 08:46 PM
తెలంగాణలో అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతమై ఉంది. ఇది కాదనలేని సత్యం. తెలంగాణ వ్యాప్తంగా డెవలప్మెంట్ జరగాలంటే నగరాలను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరాలుగా వరంగల్, కరీంనగర్ పట్టణాలు నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సరికొత్త, వినూత్నమైన విజన్ను ఆవిష్కరించారు. ఇప్పటికే 'ఫ్యూచర్ సిటీ' పేరుతో హైదరాబాద్ రూపురేఖలను మారుస్తున్న ప్రభుత్వం.. తాజాగా వరంగల్ ట్రై సిటీలు- హుజూర్నగర్, కరీంనగర్ నగరాలను కలిపి 'పంచనగరి' గా తీర్చిదిద్దే బృహత్తర సంకల్పం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ చేసిన ప్రకటన ఉత్తర తెలంగాణ భవిష్యత్తును మార్చే ఒక మాస్టర్ ప్లాన్లా కనిపిస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ఉండగా.. సైబరాబాద్తో కలిపి అది ట్రై సిటీగా మారింది. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ పూర్తయితే అది క్వాడ్ సిటీ అవుతుంది. అయితే, ఉత్తర తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వరంగల్, హన్మకొండ, కాజీపేట (త్రినగరి) ప్రాంతాలను కరీంనగర్, హుజూరాబాద్లతో అనుసంధానిస్తూ ఒకే 'సిటీ బెల్ట్'గా మార్చాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి కలలుగంటున్న 'పంచనగరి'.
అభివృద్ధే ధ్యేయంగా...
హైదరాబాద్ నగరంపై విపరీతమైన ఒత్తిడిని తగ్గించి, ఉపాధిని వికేంద్రీకరించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ కారిడార్లో వరంగల్, కరీంనగర్ నగరాల వెలుపల రింగ్ రోడ్లను నిర్మించి, వాటిని అనుసంధానించడం ద్వారా రవాణా వేగవంతం చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు నగరాల మధ్య భారీ ఇంటిగ్రేటెడ్ డంప్ యార్డ్ను ఏర్పాటు చేసి, బయో వేస్ట్ పవర్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఐటీ సెక్టార్ హబ్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఇతర ఉపాధి మార్గాలకు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా మార్చటం లక్ష్యంగా పెట్టుకున్నారు. వరంగల్లోని మామునూరు విమానాశ్రయం పూర్తి చేయడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు ఈ ప్రాజెక్టులో కీలకంగా మారనున్నాయి.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రేవంత్ రెడ్డి మూడు మండలాలుగా విభజించారు. CURE: హైదరాబాద్ ORR లోపల ఉండే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, PURE: ORR, ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్ మధ్య ఉన్న తయారీ రంగం. RARE: రీజినల్ రింగు రోడ్డుకు ఆవల ఉండే వ్యవసాయ అనుబంధ రంగాల ప్రాంతం. ఈ విభజనలో వరంగల్-కరీంనగర్ కారిడార్ తెలంగాణకు మరో హైదరాబాద్లా నిలవనుంది. తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా.. టైర్-2 నగరాలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వరంగల్ ఇప్పటికే విద్యా కేంద్రంగా ఉంది. దానికి కరీంనగర్ పారిశ్రామిక శక్తి తోడైతే ఉత్తర తెలంగాణ ఒక శక్తివంతమైన గ్రోత్ ఇంజిన్గా మారునుంది. స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా, రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాలు కొత్త పుంతలు తొక్కే ఛాన్స్ ఉంది.