|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 08:49 PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చర్లపల్లి విజయశాంతి రెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి విజయశాంతి రెడ్డి చర్లపల్లి- ఘట్కేసర్ మధ్య గూడ్స్ ట్రైన్ పట్టాలపై సూసైడ్ చేసుకోగా.. ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకొని విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లోనూ విచారించిన పోలీసులు చివరకు ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించారు. డిప్రెషన్ కారణంగానే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. ఇంటర్ చదువుతున్న పిల్లలు చేతనా రెడ్డి, విశాల్ రెడ్డిలను విజయశాంతి రెడ్డి పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుంకుందని అన్నారు. దీంతో తల్లి చెప్పినట్లే వారు నడుచుకునేవారని.. తాను చనిపోతే పిల్లలు ఒంటరవుతారనే కారణంతోనే వారిని కూడా ఆత్మహత్యలు చేసుకునేలా ఒప్పించిందని తెలిపారు. కాగా, డిప్రెషన్కు గల కారణాలపై లోతుగా ఆరా తీస్తున్నట్లు వారు వెల్లడించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతామని చెప్పారు.
ఉప్పల్ రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన విజయశాంతి రెడ్డి, సురేందర్ రెడ్డి దంపతులు. సురేందర్ రెడ్డి ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉంటుండగా.. పిల్లలు చేతనా రెడ్డి, విశాల్ రెడ్డి ఇంటర్ చదువుతున్నారు. భర్త దూరంగా ఉండటం, విజయశాంతి రెడ్డి సైతం ఓ ప్రముఖ ఐటీ సంస్థల ఉద్యోగి కావటంతో పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదవిస్తున్నారు. విజయ మాత్రం రాఘవేంద్రనగర్లో తల్లితో కలిసి ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. గత నెల 30న రాత్రి సమయంలో ఇద్దరు పిల్లల్ని హాస్టల్ నుంచి తన కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఆ తర్వాత కారును పార్క్ చేసి పార్కింగ్ స్లిప్పై ఇక బ్రతకాలని లేదు అని సూసైడ్ నోట్ రాసి రైల్వే ట్రాక్పైకి చేరుకున్నారు. అనంతరం కొద్ది సేపట్లోనే ఓ గూడ్స్ ట్రైన్ కింద పడి ముగ్గురూ సూసైడ్ చేసుకున్నారు. వాళ్లు రైల్వే ట్రాక్పైకి చేరుకుంటున్న దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
అయితే వీరి ఆత్మహత్యలు కలకలం రేపాయి. విజయ శాంతి రెడ్డికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, కుటుంబ సమస్యలు కూడా లేవు. అయినా ఆమె తీవ్ర డ్రిపెషన్కు లోనై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ కేసులో పోలీసులు గత 9 రోజుల పాటు లోతుగా విచారణ జరిపారు. ఆమె ఉద్యోగం చేస్తున్న కొలిగ్స్, భర్త, ఆమె తల్లి, సోదరుడి వాంగ్మూలాలు తీసుకున్నారు. ల్యాప్టాప్, వాట్సాప్ చాట్, కాల్ హిస్టరీ పూర్తిగా చెక్ చేశారు. చివరకు ఆమె డిప్రెషన్తోనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. అయితే డిప్రెషన్కు గల కారణాలు తెలియాల్సి ఉంది.