|
|
by Suryaa Desk | Sat, Mar 22, 2025, 05:49 PM
హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న పదో తరగతి విద్యార్థిని బస్సు కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద జరిగింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి (మార్చి 21) నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు మొదలవగా.. ఈరోజు (మార్చి 22న) సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే.. ప్రభాతి ఛత్రియ (16) అనే పదో తరగతి విద్యార్థి పరీక్ష ముగించుకుని.. తన సోదరుడు సుమన్ ఛత్రియతో కలిసి ఇంటికి బయలుదేరింది. గచ్చిబౌలి నుంచి లింగపల్లి వైపు వెళ్తుండగా.. ఫ్లైఓవర్ మీద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రభాతి ఛత్రియ మీది నుంచి ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు వెళ్లటంతో.. విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కాగా.. విద్యార్థిని సోదరుడు సుమన్కు తీవ్ర గాయాలయ్యాయి.
టీఎన్జీవో కాలనీకి చెందిన ప్రభాతి ఛత్రియకు గచ్చిబౌలిలో పరీక్షా కేంద్రం పడింది. దీంతో.. తన సోదరిని పరీక్ష కేంద్రానికి తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన సుమన్ ఛత్రియ.. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటికి తిరిగి తీసుకొస్తున్న క్రమంలో.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్ కింద పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని తీవ్రంగా గాయపడటంతో.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. కాగా.. సుమన్ ఛత్రియకు తీవ్ర గాయాలయ్యాయి.
మిగతా వాహనదారులు ఇచ్చిన సమాచారంతో.. రాయదుర్గం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన సుమన్ ఛత్రియ స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదానికి కారణం ఏంటీ అనేది పోలీసులు విచారిస్తున్నారు. ద్విచక్రవాహనం అతివేగంగా వెళ్లటం వల్లే.. ఫ్లైఓవర్ మీద అదుపుతప్పి కింద పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో అటుగా ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు రావటంతో.. అమ్మాయి బస్సు టైర్ల కింద పడిపోగా తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు సమాచారం. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.