|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 03:48 PM
రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతుండగా, రానున్న మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు, రేపు, ఎల్లుండి సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ ఏడాది రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదు కావడం, దానికి తోడు ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి చల్లని గాలులు తెలంగాణ వైపు వీస్తుండటమే చలి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణాలని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని రోజులుగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. హనుమకొండలో సాధారణం కన్నా ఏకంగా 4.2 డిగ్రీలు తగ్గి 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదేవిధంగా, పటాన్చెరులో 3.6 డిగ్రీలు తగ్గి 13.2, మెదక్లో 3.5 డిగ్రీలు తగ్గి 14.1, హైదరాబాద్లో 1.6 డిగ్రీలు తగ్గి 16.9 డిగ్రీల సెల్సియస్గా రికార్డయింది. ఆదిలాబాద్లో 14.2, హయత్నగర్లో 15.6 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.