by Suryaa Desk | Sat, Oct 26, 2024, 04:13 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. అయితే ఇందుకు కారణం కూడా ఆయనే చెప్పారు. అసలేం జరిగిందంటే... నిన్న హైదరాబాద్లో ఏబీపీ న్యూస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్' జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేటీఆర్తో పాటు ప్రకాశ్ రాజ్, గౌతమి తదితరులు పాల్గొన్నారు. గౌతమి ఇటీవలే క్యాన్సర్ నుంచి కోలుకున్నారు.కేటీఆర్ కంటే ముందే గౌతమి, ప్రకాశ్ రాజ్ వచ్చి వేదికపై కూర్చున్నారు. కేటీఆర్ వస్తూనే "హయ్ ప్రకాశ్ ఎలా ఉన్నారు?" అంటూ పలకరిస్తూ వారు కూర్చున్న వద్దకు వెళ్లారు. ప్రకాశ్ రాజ్ "హాయ్" అంటూ కేటీఆర్ను ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్... గౌతమికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓ కుర్చీలో గౌతమి కూర్చోగా, ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కేటీఆర్ కూర్చోబోతూ ఆగిపోయారు. తనకు మరోవైపు కుర్చీలో కూర్చోబోతున్న ప్రకాశ్ రాజ్ను గౌతమి పక్కన కూర్చోమని చెప్పారు. కేటీఆర్ మరో కుర్చీలో కూర్చున్నారు. తాను ఇప్పుడే ఓ బహిరంగ సభ నుంచి వచ్చానని... కాబట్టి మీ పక్కన కూర్చుంటే మీకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందంటూ ఆయన గౌతమికి దూరంగా కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.