![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎండలు తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వాతావరణం వేడి, వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి వేసవి మరింత వేడి అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే గరిష్ట స్థాయిని దాటినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. దీనికి తోడు వడగాలులు కూడా తోడవడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు బయటకి వెళ్లడం మానుకొని ఇళ్లలో ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అవసరం ఉంటే తప్ప భయటకు రావద్దని.. ఒకవేళ బటయకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనికి తోడు రానున్న రెండు రోజుల్లో వడగాలులు మరింత తీవ్రతకు చేరే అవకాశం ఉందని తెలిపారు.
అయితే.. ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. వాతావరణ శాఖ ప్రజలకు కాస్త గుడ్ న్యూస్ ఇచ్చింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను తగ్గించే అవకాశం ఉంది. మరోవైపు.. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రేపు, ఎల్లుండి వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది.
ఇక.. ప్రజలు తప్పనిసరిగా ఎండలో ఉన్నప్పుడు శరీరంపై నీళ్లు చల్లుకోవడం.. తాగడానికి వాటర్ బాటిల్ ను తీసుకెళ్లడం చేయాలని వాతావరణ శాఖ సూచించింది. ఎండలో ప్రయాణం చేసే వారు నెత్తికి రూమాలు చుట్టుకోవాలని.. టూ వీలర్ పై వెళ్లే వారు హెల్మెట్ ధరించాలని తెలియజేశారు. ఎండాకాలంలో తరచుగా వడదెబ్బకు గురి అవుతుంటారు.. అలా కాకుండా ఉండాలంటే.. బాడీని డీ హైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.