|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 03:44 PM
హైదరాబాద్ శివార్లలోని దుండిగల్లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారి కళ్లెదుటే కన్నతల్లిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి దారితీసిందని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఇంటి యజమానితో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వాతి (28)కి 2015లో రమేశ్తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. స్వాతి తన చిన్న కొడుకుతో కలిసి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లి, గ్రీన్ హిల్స్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు దిగింది.ఈ క్రమంలో ఇంటి యజమాని, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన బోయ కిషన్తో స్వాతికి పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లై పిల్లలున్న కిషన్, స్వాతితో చనువు పెంచుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే, కొంతకాలంగా తనను రెండో పెళ్లి చేసుకోవాలని స్వాతి, కిషన్పై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ విషయం కిషన్ ఇంట్లో తెలియడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. స్వాతి నుంచి వస్తున్న ఒత్తిడి, ఇంట్లో సమస్యలు భరించలేని కిషన్, ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఇందుకోసం తన అల్లుడు రాజేశ్, తన వద్ద పనిచేసే వంశీల సహాయం తీసుకున్నాడు. రాజేశ్, వంశీ పక్కా ప్రణాళికతో శనివారం ఉదయం 6 గంటల సమయంలో స్వాతి ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు చూస్తుండగానే కత్తితో గొంతు కోసి పాశవికంగా హత్య చేసి పరారయ్యారు. కళ్ల ముందే తల్లి హత్యకు గురవడంతో ఆ చిన్నారి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు బోయ కిషన్తో పాటు రాజేశ్, వంశీని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను రిమాండ్కు తరలించామని మేడ్చల్ పోలీసులు తెలిపారు.