|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:19 PM
విమానాశ్రయాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) శుభవార్తను అందించింది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ లేదా రేడియో ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి, సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ (హెచ్ఆర్) పోస్టుకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్) పోస్టుకు పదో తరగతితో పాటు మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు.సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.36,000 నుంచి రూ.1,10,000 వరకు జీతం లభిస్తుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు రూ.31,000 నుంచి రూ.92,000 వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయసు 2025 డిసెంబర్ 6వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అదనంగా కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్ష కూడా నిర్వహిస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులతో పాటు ఏఏఐలో అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు 2026 జనవరి 11వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఏఏఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.