|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 07:44 PM
హైదరాబాద్ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కాచిగూడ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ స్టేషన్ నుంచి ప్రతి నిత్యం వందల ట్రైన్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల తర్వాత ఎక్కువ మంది కాచిగూడ స్టేషన్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో స్టేషన్ను మరింత అభివృద్ధి చేసేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే రెడీ అయింది. స్టేషన్ ఆధునికీకరణ, విస్తరణకు చర్యలు చేపట్టింది. స్థానికంగా కొత్త ప్లాట్ఫాంల నిర్మాణంపై రైల్వే హైదరాబాద్ డివిజన్ యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. స్టేషన్ పక్కనే ఆర్టీసీకి చెందిన స్థలం ఉండగా.. ఆ స్థలాన్ని ఇవ్వాలంటూ సంబంధిత అధికారులు ఆర్టీసీకి ప్రతిపాదించారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులతోనూ ఇప్పటికే ప్రత్యేకంగా చర్చించారు. రైల్వేకు ఇచ్చే స్థలానికి ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలం ఇస్తామని కూడా ప్రతిపాదించారు.
నాన్న ఆశ నెరవేరకపోవటం తెలుగు రాష్ట్రాల అదృష్టం.. నేను ఎదురుచూసిన రోజు వచ్చేసింది.. గరికపాటి కుమారుడు ఎమోషనల్
రోజురోజుకూ పెరుగుతున్న హైదరాబాద్ నగర జనాభా, ట్రైన్లకు అనుగుణంగా స్టేషన్లోని ప్లాట్ ఫాంలు, స్టేబుల్, ఫిట్లైన్లు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కాచిగూడ స్టేషన్ విస్తరణపై సౌత్ సెంట్రల్ రైల్వే దృష్టి సారించింది. ఇక్కడి నుంచి ప్రతిరోజూ నగరంతో పాటు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు లోకల్ ఎంఎంటీఎస్లతో పాటు ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిల్లో వేల మంది ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. వారి సంఖ్యకు అనుగుణంగా కాచిగూడ స్టేషన్లోనూ సదుపాయాలు లేకపోవడం ప్రస్తుతం సమస్యగా మారింది.
రైల్వే స్టేషన్ను ఆనుకొని తెలంగాణ ఆర్టీసీకి 10 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని ఆర్టీసీ.. రైల్వేకు అప్పగిస్తే స్టేషన్ను విస్తరించి కొత్తగా ప్రయాణికులకు అవసరమైన ప్లాట్ఫాంలను నిర్మించడానికి వీలు కలుగుతుంది. తద్వారా కొన్ని దశాబ్దాల వరకు రైల్వేకు అవసరమైన భవిష్యత్తు అవసరాలు తీరనున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీకి అనువైన రైల్వే స్థలాన్ని తిరిగి అప్పగిస్తారు. ఈమేరకు ప్రతిపాదనలను కూడా పంపారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.