|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 03:22 PM
సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు.కావూరి రాజకీయ ప్రస్థానం లోక్సభలో అప్రతిహతంగా సాగింది. 8, 9, 12, 14, 15వ లోక్సభలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 1984, 1989, 1998లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందగా, ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వరకు కాంగ్రెస్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా ఉన్న ఆయన, 2014 తర్వాత బీజేపీలో చేరారు. అయితే గత దశాబ్ద కాలంగా ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.కావూరి సాంబశివరావుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విశాఖపట్నం ఎంపీ, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు అయిన శ్రీ భరత్, కావూరి సాంబశివరావుకు స్వయానా కుమార్తె కుమారుడు కావడం విశేషం.