|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 06:04 PM
నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం చెన్నారం గేట్ వద్ద ఆటో, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ, ఆటో బలంగా ఢీకొనటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలించే సమయంలో కన్నుమూశారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు బిహార్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. మరో ఇద్దరు బొత్య తండావాసులుగా గుర్తించారు.
మరోవైపు ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే స్థానికులు చెప్తున్నట్లు లారీ డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణమా.. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.