|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 05:09 PM
తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు నేటి నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఇవాళ నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే సమర్పించొచ్చు. కొత్తగా వాహనం కొనుగోలు చేసిన తర్వాత షోరూమ్లో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత నుంచి ఏడు రోజుల్లోగా షోరూమ్ నుంచి డీలర్ డాక్యుమెంట్లను రవాణాశాఖకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యం అయితే రవాణాశాఖ వాహన డీలర్ల లాగిన్ను సస్పెండ్ చేస్తుంది. నేటి నుంచి కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్లకు సంబంధించి నూతన విధానం అమల్లోకి వచ్చింది.
గతంలో కొత్తగా కార్లు, బైక్లు కొనుగోలు చేయగానే షోరూముల్లోనూ టెంపరరీ (తాత్కాలిక) రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఆ తర్వాత రవాణాశాఖ కార్యాలయాల్లో శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసేవారు. తాజాగా కొత్త వాహనాలకు షోరూముల్లోనే రిజిస్ట్రేషన్ చేసేలా నూతన విధానాన్ని రవాణాశాఖ అమల్లోకి తీసుకొచ్చింది. అయితే కొన్నిచోట్ల వాహనాలను రిజిస్ట్రేషన్ మూడు, నాలుగువారాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి కావడం లేదు. డీలర్లు వాహనానికి సంబంధించి ఫిజికల్ ఫారం-20ని ఆర్టీవో కార్యాలయాల్లో ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. అలాగే వాహనం కొనుగోలు చేసిన యజమాని ఫోటో అప్లోడ్ చేయడం కూడా ఆలస్యం అవుతోందట. దీంతో రవాణాశాఖ షోరూమ్ యజమానులకు వారం రోజుల డెడ్లైన్ విధించింది.
తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. డీలర్లు ఫారం-20, వాహన యజమాని, ఫైనాన్షియర్ సంతకంతో మిగిలిన డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. షోరూమ్ డీలర్ నుంచి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల్ని రెండు రోజుల్లో పరిశీలించి ఆమోదించాలి.. ఒకవేళ సవరణలు ఉంటే తిప్పి పంపాలని అధికారుల్ని ఆదేశించారు. ఇకపైకొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఫిజికల్ డాక్యుమెంట్లు స్వీకరించరు. ఒకవేళ ఎవరైనా వాహనాలకు సంబంధించ ఫేక్ డాక్యుమెంట్లు సమర్పిస్తే డీలర్లపై క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఒకవేళ దరఖాస్తు 7 రోజులకు మించి పెండింగ్లో పెడితే వాహనాలు అమ్మకుండా డీలర్ల లాగిన్ను బ్లాక్ చేస్తామని రవాణాశాఖ తేల్చి చెప్పింది.