|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 04:45 PM
రాష్ట్రంలో మరోసారి పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అవుతోంది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ పోలీస్ సర్వీస్ రూల్స్లో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనలను కేబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇప్పటివరకు ఎస్సై పోస్టులు జోనల్ స్థాయిలో ఉండగా.. వాటిని రాష్ట్ర స్థాయికి మార్చాలని పోలీస్ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. పదోన్నతుల విషయంలో తలెత్తుతున్న వివాదాల నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. జోన్లతో సంబంధం లేకుండా రాష్ట్రస్థాయి పోస్టులుగా ఎస్సైలు మారనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక విద్య, ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం కల్పించే ఉద్దేశంతో రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. పోలీస్ శాఖలో ఎస్సై పోస్టును జోనల్ స్థాయిలో ఉంటారు. అంటే ఏ జోన్కు ఎంపికైన ఎస్సైలు అదే జోన్లో పనిచేయాల్సి ఉంటుంది. అదే జోన్లో ప్రమోషన్ కూడా పొందొచ్చు. అయితే ఈ నిర్ణయం వల్ల కొంతమంది ఎస్సైలకు అన్యాయం జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకే బ్యాచ్లో ఎస్సైలుగా సెలెక్ట్ అయి ఉద్యోగంలో చేరినప్పటికీ.. ఆయా జోన్లలో ఉన్న ఖాళీల కారణంగా కొందరికి ముందుగానే ప్రమోషన్లు వస్తున్నాయి. ఖాళీలు ఉన్న జోన్లోని ఎస్సైలు సీఐ, డీఎస్పీ, అదనపు ఎస్పీలుగా ప్రమోషన్లు అందుకుంటుంటే.. అదే బ్యాచ్లో ఎస్సైగా ఎంపికై ఇతర జోన్లలో ఉన్న వారు.. ఇంకా ఎస్సైలుగానే మిగిలిపోతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి 2015లో దాదాపు 18 వేలు.. 2018లో 18,428 ఉద్యోగాలు.. 2022లో 15,644 ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేసింది. అయినా ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పోలీస్ శాఖలో 17 వేలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పోలీస్ శాఖలో మొత్తం 95,361 పోస్టులు ఉండగా.. అందులో 77,369 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని.. ఇంకా 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో ఏడాదికి 6 వేల నుంచి 7 వేల మంది రిటైర్మెంట్ అవుతుండటంతో భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి.