|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 06:30 PM
తెలంగాణ జిల్లాలకు మహర్దశ పట్టనుంది. ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని చెప్పారు. రోడ్లు – భవనాల శాఖ పురోగతిపై సీఎం రేవంత్ బుధవారం (మార్చి 11) సంబంధింత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు సమీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారులకు రింగు రోడ్లను అనుసంధానించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ - విజయవాడ ఎక్స్ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్ చేరేందుకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణంపైనా అధ్యయనం చేయాలని చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన నూతన ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బోధనాసుపత్రులు, ఇతర పెద్దాసుపత్రుల నిర్మాణలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇక ప్రభుత్వ శాఖలు ఇకనుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థ లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే వాహనాలు సైతం ఈవీలే ఉండాలని తెలిపారు. రవాణా శాఖలోని మాన్యువల్ విధానాలకు స్వస్తి చెప్పాలని, మొత్తం ఆన్లైన్లోనే కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశించారు. రవాణా శాఖపై మంత్రి పొన్నంతో కలిసి సమీక్ష నిర్వహించిన సీఎం.. ఆర్టీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదన్నారు.
వెంటనే సొంత భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచాలని, ప్రజల్లో చైతన్యం తేవడానికి షార్ట్ ఫిల్మ్లు ప్రదర్శించాలని సూచించారు. శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభమయ్యే ప్రాంతంలో అధునాతన బస్ టెర్మినల్కు స్థలం కేటాయిస్తామని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అదికారులను ఆదేశించారు.