|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 06:26 PM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురి కాకుండా హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వేల కోట్ల విలువైన భూములను కాపాడి ప్రభుత్వానికి అప్పగించింది. తాజాగా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్బాగ్లో రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా సిబ్బంది కాపాడారు. 6,427 గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేయగా.. స్పెషల్ ఆపరేషన్ చేపట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు మధ్య ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించారు. అనంతరం ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
రెండ్రోజుల క్రితం శేరిలింగంపల్లి మండలం చందానగర్ పరిధిలోని భవానీపురంలో పార్కును హైడ్రా కాపాడింది. తమ కాలనీలోని 400ల గజాల పార్కు స్థలం కబ్జాకు గురవుతోందని భవానీపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు గతంలో పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి హద్దులు నిర్ధారించారన్నారు. ఆ ప్రహరీనే పునాదులుగా చేసి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. జీహెచ్ఎంసీ అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. లే ఔట్ ప్రకారం పార్కు స్థలంగా నిర్ధారించుకుంది. మంగళవారం ఈ మేరకు ఆక్రమణలు తొలగించి 400ల గజాల స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. దీని విలువ రూ. 2 కోట్ల వరకూ ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పార్కును కాపాడిన హైడ్రాకు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఎన్ఆర్ఎస్సీ అందిస్తున్న ఉపగ్రహ ఆధారిత డేటా హైడ్రాకు వజ్రాయుధం లా మారిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. చెరువులు, నాలాల ఎఫ్టీఎల్, బఫర్ పరిధిలకు సంబంధించిన సమాచారం ఒక్కో విధంగా ఉందని.. ఇలాంటి సమయంలో ఎన్ఆర్ఎస్సీ డేటా దిక్సూచిలా మారిందన్నారు. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణలోనే కాదు.. ప్రభుత్వ భూములు, పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల లెక్క తేల్చడంలో కూడా ఈ డేటా హైడ్రాకు ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు.