by Suryaa Desk | Sat, Oct 19, 2024, 01:42 PM
జిల్లాలలో గ్రూప్స్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ సన్నద్ధం కావాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గోన్నారు.
నవంబర్ 17, 18 తేదీలలో నిర్వహించే గ్రూప్ 3 పరీక్షలు, డిసెంబర్ 15, 16 తేదీలలో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. జిల్లాల్లో చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలని, ఈ ప్రక్రియ శనివారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత అభ్యర్థుల వివరాలతో కూడిన ఓ.ఎం.ఆర్ షీట్ల ముద్రణ ప్రారంభించడం జరుగుతుందన్నారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నా పత్రాలు, ఇతర ముఖ్యమైన సామాగ్రి భద్రపర్చేందుకు స్ట్రాంగ్ రూములను గుర్తించాలన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు వీలుగా జిల్లాలోని ఒక ప్రాంతంలో ఉన్న పరీక్షా కేంద్రాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించాలని సూచించారు.
గ్రూప్ 3 పరీక్షకు 3 పేపర్లు, గ్రూప్ 2 పరీక్ష 4 పేపర్లు రాసేందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్ పరిధిలో స్ట్రాంగ్ రూమ్ గుర్తించాలని అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ పరిధిలో అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర స్ట్రాంగ్ రూమ్ ఉండాలన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ 3 పరీక్షకు 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు 7320 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు, ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాల్, కలెక్టరేట్ పర్యవేక్షకులు వేణు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.