by Suryaa Desk | Sat, Oct 19, 2024, 03:29 PM
వికారాబాద్ పట్టణ లో డ్రోన్ కెమెరాల సహాయంతో చేయబోయే మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే భవిష్యత్తులో వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని, సమస్యలు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక పోషిస్తుందని చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఈరోజు చైర్ పర్సన్ గారి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, మున్సిపల్ సిబ్బందికి మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వేపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డిజిటల్ సర్వేకు కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు ప్రతి ఒక్కరు సహకరించాలని, మీ సహకారమే భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తును ఇస్తుందని అన్నారు.|
ఈ సందర్భంగా చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అమృత్ 2.0 కింద వికారాబాద్ మున్సిపాలిటీలో మొట్టమొదటిసారి డ్రోన్ కెమెరాల సహాయంతో డిజిటల్ సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ తో వికారాబాద్ మున్సిపల్ లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం డిజిటలైజ్ చేయడమే కాకుండా, భవిష్యత్తు తరాలకు ఎలాంటి సమస్యలు లేని మాస్టర్ ప్లాన్ అందించడం జరుగుతుందని అన్నారు. నా ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరగడం చాల సంతోషంగా ఉందని అన్నారు. మీ మీ వార్డులలో సర్వే చేయడానికి వచ్చిన డిటిసిపి అధికారులకు మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, ఇన్చార్జి కమిషనర్ రాకేష్ రెడ్డి, డిటిసిపి అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.