|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 07:45 PM
ఈమధ్యకాలంలో ఏసీబీ అధికారులు దాడుల గురించి నిత్యం వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి.. భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన అధికారుల గురించి నిత్యం వింటూనే ఉన్నాం. ఈ క్రమంలో మరో అవినీతి అధికారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సదరు అధికారి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓయూలో పనిచేస్తున్నారు. పైగా మరో రెండు నెలల్లో రిటైర్ కాబోతున్నారు. అలాంటి వ్యక్తి రూ.11 వేలు లంచం తీసుకుంటూ అధికారుల చేతికి చిక్కారు.
మరో 2 నెలల్లో రిటైర్ కాబోతున్న ఓయూ డీఈ లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు చిక్కారు. కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.11 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు ఓయూలో డిప్యూటీ ఇంజనీర్గా పని చేస్తున్న రాకొండ శ్రీనివాసులు. ఈక్రమంలో మానేరు బాలుర హాస్టల్ పునరుద్ధరణ పనులకు సంబంధించి.. కాంట్రాక్టర్కు రూ.14 లక్షల బిల్లు రావాల్సి ఉంది. దీనిలో సగం అంటే రూ.7 లక్షల బిల్లు విడుదల చేయాల్సి ఉండగా.. డీఈగా ఉన్న శ్రీనివాసులు ఇందుకు గాను 11 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.
దీంతో సదరు కాంట్రాక్టర్ ముందుగా శ్రీనివాసులుకు రూ.5 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. మరో 6 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఆ మొత్తం కోసం శ్రీనివాసులు కాంట్రాక్టర్పై ఒత్తిడి చేయసాగాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనల ప్రకారం సదరు కాంట్రాక్టర్.. మంగళవారం నాడు డీఈ శ్రీనివాసులుకు రూ.6 వేలు ఇచ్చాడు. ఈ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు డీఈని అదుపులోకి తీసుకున్నారు. మరో రెండు నెలల్లో రిటైర్ కావాల్సిన వ్యక్తి.. ఇలా అవినీతి అధికారుల వలలో చిక్కుకోవడం గమనార్హం.
కొన్ని రోజుల క్రితం హనుమకొండ అడిషనల్ కలెక్టర్ భారీగా లంచం తీసుకుంటూ పట్టబడ్డ సంగతి తెలిసిందే. అదనపు కలక్టర్ వెంకట్ రెడ్డి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. అలానే ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా పని చేస్తున్న ఓ ఉద్యోగి ఏకంగా రూ.100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టిన సంగతి తెలిసిందే. ఆయన మూడు రాష్ట్రాల్లో భారీగా వ్యవసాయ భూమి, ప్లాట్లు కొనుగోలు చేశారు. దీనితో పాటు బంగారం, ఖరీదైన కార్లు కొనుగోలు చేశారు.