by Suryaa Desk | Sat, Oct 19, 2024, 06:59 PM
ఇద్దరిదీ ఒకే కాలేజ్.. కానీ వేర్వేరు గ్రూపులు. మొదట ఒకరికొకరికి ముఖ పరిచయం కూడా లేదు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రాను రాను ప్రేమగా రూపాంతరం చెందింది. ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా.. పీకల్లోతు ప్రేమల్లో మునిగి తేలారు. మధ్యలో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల.. తన ప్రియున్ని ప్రేయసి దూరం పెట్టటం ప్రారంభించింది. అంత గాఢంగా ప్రేమించిన తన ప్రేయసి.. తనను దూరం పెట్టటాన్ని ఆ ప్రియుడు తట్టుకోలేకపోయాడు. తమ ప్రేయసి దూరమవుతోందన్న బాధో, భయమో.. ఎలాగైనా దక్కించుకోవాలన్న తపనో కానీ.. ఆ ప్రియుడు కఠినంగా వ్యవహరించాడు. ప్రేమించిన తన ప్రేయసిపైనే బ్లేడ్తో దాడి చేసిన ఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి సమీపంలోని చోడవరానికి చెందిన మధుసూదన్రెడ్డి (22) అనే యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన యువతి (21).. నెల్లూరు జిల్లాలోని ఒక ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ చేశారు. అయితే.. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నా.. వేర్వేరు డిపార్ట్ మెంట్లు కావటంతో.. స్నేహితుల ద్వారా పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వాళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండగానే.. ఐటీ కోర్టులో శిక్షణ తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చారు.
అమీర్పేటలోని సత్యం థియేటర్ సమీపంలో ఉన్న ఓ కోచింగ్ సంస్థలో ఇద్దరూ శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో.. మధుసూదన్ రెడ్డి.. మద్యం, ఇతర వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో.. మధుసూధన్ రెడ్డిని యువతి దూరం పెట్టటం ప్రారంభించింది. ఇంతకుముందు ఎంతో ప్రేమగా ఉన్న తన ప్రేయసి ఇప్పుడు దూరం పెట్టటంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆమెను భయపెట్టో, బెదిరించో మళ్లీ తనదాన్ని చేసుకోవాలని ప్లాన్ చేశాడు.
ఈ క్రమంలోనే.. గురువారం (అక్టోబర్ 17) సాయంత్రం ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న తన ప్రేయసితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎప్పటిలాగే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో.. తీవ్ర కోపోద్రిక్తుడైన మధుసూదన్ రెడ్డి తన ప్రేయసిపై బ్లేడ్తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె మెడకు తీవ్ర గాయమైంది. అదే సమయంలో.. అటుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సార్నగర్ పోలీసులు తెలిపారు.