|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 08:00 PM
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నట్లు తేల్చి చెప్పారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జీహెచ్ఎంసీ పరిధి అంతటా తిరిగి హస్తం పార్టీ తరఫున ప్రచారం చేస్తానని వెల్లడించారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే విజయం అని స్పష్టం చేశారు. అదే తన స్పెషాలిటీ అని పేర్కొన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అయితే మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరెవరు, ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని దానం నాగేందర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిపి మొత్తం 300 డివిజన్లలో విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ విచారణ జరుపుతున్న వేళ.. తాను కాంగ్రెస్ పార్టీలోనే చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవంటూ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఇక పోచారం శ్రీనివాస్రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్ కుమార్ల ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ తుది తీర్పు ఇవ్వాల్సి ఉండగా.. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు కూడా ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు.
స్పీకర్ నోటీసులపై స్పందించిన కడియం శ్రీహరి.. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. కానీ దానం నాగేందర్ మాత్రం ఇప్పటివరకు స్పీకర్కు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. ఇలాంటి తరుణంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పడంతో.. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే తెలంగాణలో మరో ఉపఎన్నిక రానుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.