|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 08:28 PM
సామాన్యుడి పోషకాహారమైన కోడిగుడ్డు ఇప్పుడు పేద, మధ్య తరగతి వారికి భారంగా మారింది. గత కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతూ వచ్చిన గుడ్డు ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకాయి. పౌల్ట్రీ రంగ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ ధరలు నమోదు కావడంతో అటు వినియోగదారులు, ఇటు వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకు బహిరంగ మార్కెట్లో రూ. 5 నుండి రూ. 6 మధ్య ఉన్న కోడిగుడ్డు ధర.. ప్రస్తుతం రికార్డు స్థాయిలో రూ. 8 కి చేరుకుంది. ఇక హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు ధర రూ. 7.30 పలుకుతుండటం విశేషం. గతంలో ఒక ట్రే (30 గుడ్లు) రూ. 160 నుండి రూ. 170 వరకు లభించగా.. ప్రస్తుతం అది రూ. 210 నుండి రూ. 220 కి చేరింది. ఇక నాటు కోడి గుడ్ల విషయానికి వస్తే, ఒక్కో గుడ్డు ధర రూ. 15 వరకు పలుకుతోంది. చలికాలంలో గుడ్లకు డిమాండ్ పెరగడం సాధారణమే అయినప్పటికీ ఈ స్థాయి ధరలు రావడం పౌల్ట్రీ చరిత్రలో ఇదే మొదటిసారి అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్కు తగిన ఉత్పత్తి లేకపోవడమే. గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. అయితే, కోళ్ల ఫారాల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవ్వడంతో చాలా మంది రైతులు ఈ రంగానికి దూరమయ్యారు. కోళ్లకు పెట్టే దాణా, మక్కలు, సోయా, చేపపొట్టు వంటి ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల చిన్న, మధ్యతరహా రైతులు కోళ్ల ఫారాలను మూసివేశారు. గతంలో కోల్డ్ స్టోరేజీలలో దాదాపు 20 కోట్ల గుడ్లు నిల్వ ఉండేవని, ప్రస్తుతం ఆ నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.
మధ్యతరగతి, పేద కుటుంబాల్లో ప్రోటీన్ ఆహారానికి కోడిగుడ్లే ప్రధాన ఆధారం. కూరగాయల ధరలు పెరిగినప్పుడు అందరూ గుడ్డుపైనే ఆధారపడతారు. కానీ ఇప్పుడు గుడ్డు ధర కూడా పెరగడంతో సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. కేవలం ఇళ్లలోనే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీ ఉత్పత్తుల ధరలపై కూడా దీని ప్రభావం పడుతోంది. ఎగ్రైస్, ఆమ్లెట్ వంటి చిరుతిళ్ల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం సరఫరా చేసే మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ పెరిగిన ధరల వల్ల భారంగా మారనుంది.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. మరో రెండు నెలల వరకు గుడ్డు ధరలు తగ్గకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగ, శీతాకాలం ముగిసే వరకు డిమాండ్ ఇలాగే ఉండటంతో ధరలు కూడా ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. కోళ్ల దాణాపై సబ్సిడీ ఇవ్వడం లేదా ఉత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప ధరలు అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.