|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 07:29 PM
సంక్రాంతి సంబరాల వేళ తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే భారీ ఏర్పాట్లు చేస్తోంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేయడం విశేషం. భాగ్యనగరం నుండి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఏటికేడాది పెరుగుతున్న తరుణంలో.. ఈసారి ఆ సంఖ్య ముప్పై లక్షలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గతంలో పండుగకు కొద్ది రోజుల ముందు మాత్రమే ప్రత్యేక రైళ్లను ప్రకటించే సంప్రదాయం ఉండేది. కానీ ఈసారి ప్రయాణికుల సౌకర్యార్థం నెల రోజుల ముందే 124 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించారు. జనవరి 24 వరకు విడతల వారీగా మొత్తం నాలుగు వందలకు పైగా రైళ్లు నడపనున్నారు. గత ఏడాది కూడా ఇటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ.. అప్పుడు సుమారు 250 రైళ్లతోనే సరిపెట్టారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈసారి ఆ సంఖ్యను గణనీయంగా పెంచారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి వంటి నగరాలకు వెళ్లే మార్గాల్లో టిక్కెట్ల గిరాకీ విపరీతంగా ఉండటంతో.. ఆయా మార్గాల్లో అదనపు రైళ్లను నడుపుతున్నారు. సాధారణంగా సంక్రాంతి పండుగను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. కోడి పందేళ్ల దగ్గర నుంచి ఆయా గ్రామాల్లోని వివిధ రకాల ఆటలతో సందడి సందడిగా ఉంటుంది. అందుకే .. హైదరాబాద్ లో జాబ్ చేసే చాలా మంది తమ స్వగ్రామానికి వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. చాలా మంది ట్రైన్లలో వెళ్లేందుకు ఇష్టపడుతుండటంతో.. రైళ్లన్నీ ఫుల్ అయిపోతున్నాయి. వాటికి అనుగుణంగానే అధికారులు అదనపు రైళ్లను నడుపుతున్నారు.
దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీల కంటే కొంత అదనపు చార్జీలు వసూలు చేస్తారు. ముందస్తు బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బెర్తులన్నీ భర్తీ అవుతుండటంతో.. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారి సంఖ్యను బట్టి మరిన్ని రైళ్లను పెంచే ఆలోచనలో ఉన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రస్తుతం ఆధునీకరణ పనులు జరుగుతున్నప్పటికీ.. పండుగ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన ఈ పండుగ వేళ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడమే లక్ష్యంగా రైల్వే యంత్రాంగం నిరంతరం పని చేస్తోంది.