|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 07:19 PM
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో వెలుగుచూసిన నకిలీ నోట్ల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక రైతు తన పంట రుణాన్ని చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది. నిజామామాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన నరెడ్ల చిన్న సాయిలు అనే రైతు.. గతంలో తాను తీసుకున్న పంట రుణాన్ని తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రూ. 2,08,500 నగదుతో స్థానిక కెనరా బ్యాంకుకు చేరుకున్నాడు.
నగదును కౌంటర్లో అందజేయగా.. బ్యాంకు అధికారులు ఆ నోట్లను లెక్కిస్తుండగా వాటిపై అనుమానం కలిగింది. నిశితంగా పరిశీలించిన అధికారులు.. ఆ కట్టలో ఉన్న మొత్తం 417 ఐదు వందల రూపాయల నోట్లు నకిలీవని నిర్ధారించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు రైతును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ దొంగ నోట్లకు , ఇటీవలే ముగిసిన సర్పంచ్ ఎన్నికలకు దగ్గరి సంబంధం ఉన్నట్లు తేలింది.
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఒక అభ్యర్థి ఈ నకిలీ నోట్లను భారీగా పంపిణీ చేసినట్లు సమాచారం. సదరు రైతు తన ధాన్యాన్ని బ్రోకర్ల ద్వారా విక్రయించగా.. వారు ఈ దొంగ నోట్లను అతడికి అంటగట్టినట్లు తెలుస్తోంది. ఇవే డబ్బులను ఆ గ్రామంలోని ఓటర్లకు పంచినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే ఓటు కోసం నోటు తీసుకున్న ఓటర్లలో గుబులు మొదలైంది. తమ వద్ద ఉన్నవి కూడా నకిలీ నోట్లేమోనని జలాల్పూర్ ప్రజలు లబోదిబోమంటున్నారు.
ఈ సంక్షోభ సమయంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు. నిరక్షరాస్యుడైన రైతు చిన్న సాయిలు మోసపోయాడని గ్రహించిన సర్పంచ్.. వెంటనే రంగంలోకి దిగారు. అమాయక రైతుపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా.. అసలు కేటుగాళ్లను పట్టుకోవాలని పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. గ్రామంలోని ఇతర రైతులు, ప్రజలు తమ వద్ద ఉన్న నగదును సరిచూసుకోవడానికి బ్యాంకు అధికారులతో కలిసి తక్షణమే ఒక అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.