|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 07:37 PM
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు , జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తూ.. ఎంప్లాయీస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్లలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి.. రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 12 వెల్నెస్ సెంటర్ల నిర్వహణ తీరులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఖైరతాబాద్, కూకట్పల్లి వెల్నెస్ సెంటర్ల బాధ్యతలను నిమ్స్ ఆసుపత్రికి అప్పగించారు. దీనివల్ల నిమ్స్ నిపుణులైన వైద్యులు నేరుగా ఈ సెంటర్లలో రోగులకు అందుబాటులో ఉంటారు. మిగిలిన పది వెల్నెస్ సెంటర్ల నిర్వహణను వైద్య విద్య విభాగం పర్యవేక్షించనుంది. దీనివల్ల పాలనాపరమైన జాప్యం తగ్గి, వైద్య సేవలు వేగవంతం అవుతాయి.
ఇప్పటివరకు ఈ వెల్నెస్ సెంటర్లలో కేవలం సాధారణ వైద్యం, దంత చికిత్స, ఫిజియోథెరపీ వంటి సేవలు మాత్రమే ఎక్కువగా అందుతున్నాయి. ఇకపై దశలవారీగా కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితో పాటు.. పిల్లల వైద్యం, చర్మవ్యాధుల విభాగం అంటే పీడియాట్రిక్స్ , డెర్మటాలజీ విభాగాలు కూడా కొలువుదీరనున్నాయి.
వైద్య సేవల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం సాంకేతికతను జోడిస్తోంది. రోగులు గంటల తరబడి వేచి ఉండకుండా.. ఆన్లైన్ ద్వారా ఓపీ స్లాట్ బుక్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందిస్తున్నారు. వెల్నెస్ సెంటర్లలో మందులు లేవనే ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు.. మందుల కొనుగోలు నుండి పంపిణీ వరకు పూర్తి ప్రక్రియను డిజిటలైజ్ చేయాలని మంత్రి ఆదేశించారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ అవుతాయి.
వచ్చే రోగులకు, వారి సహాయకులకు ఇబ్బంది కలగకుండా వెయిటింగ్ ఏరియాలను అభివృద్ధి చేయడంతో పాటు.. అవసరమైన అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షల పరికరాలను ఈ సెంటర్లలోనే ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఉద్యోగులు, జర్నలిస్టులు పెద్ద పెద్ద ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.