|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 07:08 PM
భాగ్యనగర పొలిమేరల్లోని ఉప్పల్ ప్రాంతం శనివారం ఉదయం ఒక్కసారిగా కోలాహలంగా మారింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లచెరువు వద్ద వందలాది మంది జనం ఎగబడటంతో అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. అయితే ఈ గుంపులు కూడింది ఏదో శుభకార్యం కోసం కాదు.. చెరువులో దొరుకుతున్న చేపల కోసం. ఉప్పల్ చెరువులో నీరు తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా చేపలు బయటపడ్డాయి. ఇది చూసిన స్థానికులు, అటుగా వెళ్లే ప్రయాణికులు తమ వాహనాలను పక్కన నిలిపి మరీ బురదలోకి దూకారు. దొరికిన వారికి దొరికినన్ని చేపలు అన్న చందంగా వేట సాగింది.
పైకి చూడటానికి ఈ చేపల వేట సరదాగా అనిపించినా.. దీని వెనుక అత్యంత భయంకరమైన ఆరోగ్య ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పల్ నల్లచెరువు మంచి నీటితో నిండిన చెరువు కాదు. చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుండి వచ్చే ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలు, మురుగునీరు ఈ చెరువులో చేరుతున్నాయి. ఈ నీటిలో పాదరసం, సీసం వంటి భార లోహాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇక్కడ పెరిగే చేపల శరీరంలోకి ఈ విషపూరిత పదార్థాలు చేరుతాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే మూత్రపిండాల వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉచితంగా దొరుకుతున్నాయి కదా అని తీసుకువెళ్లే ఈ చేపలు వాస్తవానికి ‘స్లో పాయిజన్’ వంటివని స్థానికులు గుర్తించలేకపోతున్నారు.
మరోవైపు.. ప్రభుత్వం ఉప్పల్ చెరువు కట్ట సుందరీకరణ పనులను వేగవంతం చేసింది. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో ఇక్కడ భారీ యంత్రాలతో హైడ్రా ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి పనులు జరుగుతుండటం... మరోవైపు చేపల కోసం జనం రోడ్లపై వాహనాలు ఆపడంతో ఉప్పల్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చెరువులోని బురదను కదిలించడంతో ఆ ప్రాంతమంతా భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. ఇది స్థానికుల ఆరోగ్యానికి మరింత ఇబ్బందిగా మారింది.
ప్రజలు ఆశకు పోయి తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. కలుషిత చెరువుల్లో దొరికే చేపలను మార్కెట్లలో అమ్మే అవకాశం కూడా ఉన్నందున.. వినియోగదారులు చేపలు కొనేటప్పుడు అవి ఎక్కడి నుండి వచ్చాయో ఆరా తీయడం మంచిదంటున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ కలుషిత చేపల వేటను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.