|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 03:08 PM
కేరళలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో తీవ్ర విషాదానికి దారితీసింది. తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి చేసిన ఆరోపణల కారణంగా మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో వీడియో పోస్ట్ చేసిన యువతిపై ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించి, విచారణకు ఆదేశించింది.కోజికోడ్కు చెందిన 42 ఏళ్ల యు.దీపక్ అనే వ్యక్తిపై వడకరకు చెందిన 35 ఏళ్ల షిమ్జిత ముస్తఫా అనే యువతి జనవరి 16న సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణిస్తుండగా దీపక్ తనను అసభ్యంగా తాకాడని ఆమె ఆరోపించింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయి, లక్షల మందికి చేరింది.ఈ పరిణామంతో దీపక్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. వీడియో వైరల్ అయిన రెండు రోజుల తర్వాత, జనవరి 18న గోవిందపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి మృతికి షిమ్జిత పెట్టిన వీడియో, దానివల్ల కలిగిన అవమానమే కారణమని దీపక్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీపక్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీసులు సోమవారం షిమ్జితపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపణ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం షిమ్జిత పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.